Saturday 4 May 2013

ధర్మపత్నికి విలువనిచ్చిన సంప్రదాయం

భారత దేశం స్త్రీకి గౌరవ స్థానం ఇచ్చితీరాలని ప్రబోధిస్తుంది. స్త్రీ, పురుషులు ఇద్దరు సమమేనని తెలియజేస్తుంది. అలాగే భార్య మాట నొక్కేయటం, ఆమె మాటకు విలువనివ్వని భర్త నష్టాల పాలు కావలసిందేనని వివరించే కథ పంచతంత్రం మిత్రబేధంలో కనిపిస్తుంది.

ఓ సముద్రతీరాన ఉన్న ఒక చెట్టు మీద ఒక పిట్టలజంట గూడు కట్టుకొని హాయీగా కాపురం చేస్తూ ఉండేవి. కొన్నాళ్లకు ఆడ పిట్ట గుడ్లు పెట్టే సమయం వచ్చేసింది. చుట్టూ ఉన్న పరిసరాల్ని, పరిస్థితులని గమనించే ఆడ పిట్ట తన భర్త అయిన మగ పిట్టను పిలిచి సముద్రం పొంగే సూచనలు ఉన్నాయని, ఉవ్వెత్తున ఎగసె అలలకు గుడ్లు కొట్టుకుపోతాయని కాబట్టి ఇక్కడ నుండి వెళ్లి మరో చోట తన గుడ్లు పెడతానని అంది, ఇది విన్న మగ పిట్ట సముద్రుడి గురించి భయపడాల్సిన అవసరం లేదని, సముద్రుడు గరుత్మంతుడు మిత్రులేనని కాబట్టి ఏ ప్రమాదము  ఉండదని చెప్పి, ఆహరం కోసం అక్కడినుండి వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న సముద్రుడు భార్య మాట వినని భర్తకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు.



వెంటనే సముద్రుడు తన అలలతో ఉవ్వెత్తున ఎగసి పరిసరాల్ని ముంచెత్తాడు, అక్కడ ఉన్న పిట్ట గుడ్లను సైతం తనలో కలిపెసాడు. కొద్ది సేపటికి మగ పిట్ట అక్కడికి వచ్చి విషయం తెలుసుకుంది. తన భార్య చెప్పినా విననందుకు వాటిల్లిన నష్టానికి బాధపడసాగింది. ఇది జరిగిన తరువాత చాలా కాలం పాటు రెండు పిట్టలు తమ దైవమైన గరుత్మంతుని గూర్చి తీవ్రంగా పూజలు చేస్తూ ప్రార్తించాయి. ఒక రోజు గరుత్మంతుడు కరుణించి, సముద్రుడిని అడిగి పిట్ట గుడ్లు తిరిగి వాటికి అందేలా చేసాడు.

ఈ కథలోని మర్మం గమనిస్తే భార్య మాట వినకపోవడం వాళ్ళ వాటిల్లిన తీవ్ర నష్టాన్ని తెలుసుకోవచ్చు. భార్యను మించిన హితైషి వేరొకరు ఉండరని, కష్టకాలంలో భార్యే తోడుగా నిలుస్తుందని ఈ కథ తెలియజేస్తుంది.