Wednesday 12 June 2013

వాస్తు శాస్త్రము

భారతీయ పురాణాలు, వేదాలు ఇంకా రుషులు వాస్తుశాస్త్రంపై అనేక శోదనలు చేసి ప్రజలకు అందించారు. ప్రస్తుత కాలంలో  వాస్తుశాస్త్రంపై చాలా పరిశోధనలు కూడా జరుగుతూ వున్నాయి. మనిషి నిత్యం నివాసం ఉండే చోటు యొక్క ప్రభావం కుడా మనిషిపై ఉంటుందనేది సత్యము. నేటి కాలంలో అవసరానికి అనుగుణంగా తరచూ ఇళ్ళు మారడం అలవాటైపోయింది, అయిన సరే ప్రతి ఇంటి ప్రత్యేకత ఆ ఇంటి వాస్తు అమరికను బట్టి మారుతుంది. ఈ విషయం నిత్యం ఇళ్ళు మారుస్తూ ఉండేవారిని అడిగితే తెలుస్తుంది.

వివిధ వాస్తు సిద్ధాంతాలు, ప్రదిపాదనలు అనేకం నేడు అందుబాటులో ఉన్నాయి. కొందరు మత్స్యపురాణాన్ని అనుసరించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టితె, కొందరు వాస్తు పండితుణ్ణి సంప్రదించి ఇల్లు కట్టుకుంటారు. మొత్తానికి వాస్తుతో కూడుకున్న ఇళ్ళకి మార్కెట్లో కూడా చాలా విలువ వచ్చేసింది.

ఎనిమిది దిక్కులు వాటి ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.

1. తూర్పు - ఈ దిశ సూర్యున్ని సూచిస్తుంది. శుభకరమైనది. ఎక్కువ బరువును తట్టుకోలేదు,  ఈ దిశగా నీటి ప్రవాహం శుభసూచకం. 

2. ఉత్తరం - ఈ దిశ బృహస్పతిని సూచిస్తుంది. శుభకరమైనది. ఎక్కువ బరువును తట్టుకోలేదు,  ఈ దిశగా నీటి ప్రవాహం శుభసూచకం. 

3. పశ్చిమం - ఈ దిశ శనిని సూచిస్తుంది. ఎక్కువ బరువును తట్టుకోగలదు,  ఈ దిశగా నీటి ప్రవాహం అశుభసూచకం.

4. దక్షిణం - ఈ దిశ కుజున్ని సూచిస్తుంది. ఎక్కువ బరువును తట్టుకోగలదు,  ఈ దిశగా నీటి ప్రవాహం అశుభసూచకం.

5. ఈశాన్యం - ఇది తూర్పు, ఉత్తర దిశల మధ్య ఏర్పడే మూల. అత్యంత శుభకరమయినది. బరువును తట్టుకోలేదు. ఈ దిశ బుదున్ని సూచిస్తుంది. 

6. వాయువ్యం - ఇది ఉత్తర, పశ్చిమ  దిశల మధ్య ఏర్పడే మూల. కొంత బరువును తట్టుకోగలదు. ఈ దిశ కేతువుని సూచిస్తుంది. 

7. నైరుతి - ఇది పశ్చిమ, దక్షిణ  దిశల మధ్య ఏర్పడే మూల. బరువు ఎంతైనా తట్టుకోగలదు. ఈ దిశ రాహువుని  సూచిస్తుంది.

8. ఆగ్నేయం -  ఇది దక్షిణ, తూర్పు  దిశల మధ్య ఏర్పడే మూల. కొంత బరువును తట్టుకోగలదు. ఈ దిశ చంద్రుడిని సూచిస్తుంది.




Monday 10 June 2013

సూర్యచంద్రగ్రహణాలు సంభవించడానికి గల కారణం

దుర్వాసుని శాప ప్రభావం చేత దేవతలు తమ సమస్తమంతా సముద్రంలో కోల్పోయారు. ఇక దీనికి పరిష్కారం సముద్రమథనమేనని శ్రీమహావిష్ణువు ద్వారా తెలుసుకున్న దేవతలు, మథనానికి సన్నాహాలు చేయసాగారు. శ్రీమహావిష్ణువే స్వయంగా కూర్మావతారం ధరించి మేరుపర్వతాన్ని కవ్వంగా తనె మోయడానికి ముందుకివచ్చాడు.  ఆదిశేషుడు తాడుగా సముద్రమథనానికి తోడ్పడ్డాడు. బలవంతులైన రాక్షసుల సహాయం అవసరమని గ్రహించిన దేవతలు, రాక్షసులను సహాయం అర్థించారు. తమకు సముద్రమథనం ద్వారా వచ్చే అమృతంలో సగభాగం ఇస్తేనే సహాయం చేస్తామని షరతు పెట్టారు. ఈ షరతుకు అంగీకరించిన దేవతలు రాక్షసులతో కలిసి సముద్రమథనం చేయసాగారు.

అనేకానేక సంపదలు సముద్రంనుండి బయల్పడసాగాయి. దేవతలు వీటిని పంచుకున్నారు. అమృతాన్ని ధన్వంతరి నారదునికి ఇస్తాడు. నారదుడు వెళ్లి శ్రీహరికి ఇచ్చి ఎలాగైనా అమృతాన్ని రాక్షసుల బారినుండి కాపాడమంటాడు. శ్రీహరి మోహినీ అవతారాన్ని దాల్చి రాక్షసులను మొహపరవశులను చేసి అమృతాన్ని దేవతలకు రాక్షసులకు సరి-సమానంగా పంచుతానని చెప్పి తన మోహన రూపంతో ఒప్పిస్తాడు. కాని రాక్షసులకు మధువును పంచుతూ దేవతలకు అమృతాన్ని పంచుతూ ఉంటాడు. ఇది గమనించిన రాహువు అనే రాక్షసుడు దేవతల వరుసలోకి వచ్చి కూర్చుంటాడు. అమృతం కుడా తాగడం ప్రారంభిస్తాడు. ఇంతలో సూర్య-చంద్రులు ఇది చూసి మోహినికి సైగ చేసి చెప్తారు. వెంటనే మోహిని శ్రీహరిగా మారి తన సుదర్శన చక్రంతో రాహువుని తల వేరుచేస్తాడు. అప్పుడు తల కేతువుగా కాయము రహువుగా ఏర్పడతాయి. రాహు-కేతువులు అమృతాన్ని తాగి అమరులవుతారు, కానీ తమ అమృత దాహాన్ని పూర్తి కానివ్వకుండా చేసిన సూర్య- చంద్రులను పగతో చేసే దాడి సమయాన్ని సూర్య-చంద్ర గ్రహణాలుగా భావిస్తారు. ఈ కాలమందు ఎలాంటి శుభకార్యాలు చేయరు. 

Saturday 8 June 2013

పెద్దలను గౌరవించకుంటే ఎదుర్కొవల్సివస్తుంది ఘోరవిపత్తు

పూర్వం దేవదానవయుద్ధం జరుగుతూవుండేది. ఒకనాడు ఇంద్రుడు యుద్ధరంగంలొ విజయం సాధించి పెద్దవూరేగింపుగా తన ఐరావతంపై రాసాగాడు. దేవతలంతా జయజయ ధ్వనాలు చేస్తూ ఇంద్రున్ని అనుసరించసాగారు. ఋషులు, మునులు, సిధ్ధులు మార్గమధ్యలొ ఇంద్రునికి పూమాలలు వేస్తూ అభినందించసాగారు. ఇదంతా గమనిస్తున్న నారదుడు తన సమీపంలొ వున్న దుర్వసమహాముని చెంతకు వచ్చి ఒక పుష్పాన్ని ఇచ్చి, ఆ పుష్పం సాక్షాత్తూ శ్రీమహావిష్నువు తనకు ఇచ్చాడని ఇప్పుడు అదే పుష్పాన్ని దుర్వాసునికి ప్రీతీతొ అందజేస్తున్నానని చెప్పి ఇస్తాడు.


ఇంతలో ఐరావతంపై ఇంద్రుడు దుర్వాసముని సమీపంగా వెళ్ళసాగాడు. దగ్గరలొ వున్న దుర్వాసుడు వెళ్ళి ఐరావతంపైనున్న ఇంద్రున్ని అభినందించి, నారదుడిచ్చిన పుష్పాన్ని ఇంద్రుడికి బహూకరిస్తాడు. కేవల పుష్పాన్ని ఇంద్రుడు అంతగా పట్టించుకోకుండా ఆ పుష్పాన్ని జారవిడుస్తాడు. ఆ పుష్పం ఐరావతంపై పడుతుంది, ఐరావతం తన తొండంతో పుష్పాన్ని కింద పడవేసి కాలితో తొక్కివేసి వెళుతుంది. ఇంద్రుడు ఇదంతా గమనించకుండానే వెళుతుంటాడు. 

ఇంద్రుడి ఈ విపరీత ధోరణి దుర్వసమహాముని మనస్సుని కలిచివేస్తుంది. ఋషులందరిలొ అతికోపిష్టిగా పిలువబడే దుర్వాసుడు తనకు జరిగిన అవమానాన్ని సహించలేకపోయాడు. వెంటనే ఆయన ఇంద్రున్ని చేరి దేవతలంతా తమ సమస్త సంపదలు, శక్తులు కోల్పోతారని, ఇవన్నీ సముద్రంపాలు అవుతాయని శపిస్తాడు.

పెద్దలను గౌరవించకపోవడం వల్ల జరిగే విపత్తు ఈ కథ సందర్భాన్ని బట్టి తెలుస్తుంది. 

Wednesday 5 June 2013

అతి బలవంతుడు హనుమంతుడు

వాయుపుత్రుడైన హనుమంతుడు కేవలం శారీరక బలంలోనే కాకుండా బుధ్ధిబలంలో కూడా ఎంతొ పరిణతి కలిగివుండేవాడు. తన శక్తిసామర్త్యాలతొ చిన్నతనంలోనే సూర్యభగవానున్ని, ఇంద్రున్ని మెప్పించాడువారి ఆశీర్వాదంతో మరెంతో శక్తిమంతుడయ్యాడు. నమ్మిన బంటుగా ఉండే హనుమంతుడు వివిధ శాస్త్రాలలో, వేదాలలో ఇంకా వ్యాకరణంలో ఎంతో నిష్టతుడిగా పేరుగడించాడు. వ్యాకరణ  శాస్త్రంలో పటుత్వం పొందాలంటే హనుమంతున్ని పూజించాలని పెద్దలు చెబుతారు. కేసరి, అంజన సుతుడైన హనుమంతుడు పరమశివుని అంశగా పురాణాలలో కనిపిస్తాడు.

                              

శ్రీ రాముడు సీత వియోగంతో వున్నసమయంలొ, శ్రీ రామునికి అన్ని విధాలా సహాయం చేస్తూ సీతాన్వేషణ సఫలీకృతం కావడానికి గల ముఖ్యకారణం ఆంజనేయుడె. అతి బలవంతుడై సముద్రాన్ని లంఘించి లంకలో దావానలాన్ని సృష్ఠించాడు. హనుమంతుడి మాటలు చిన్నవిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉంటాయని రామాయణం చెబుతోంది. చిరంజీవి అయిన హనుమంతుడు ఇప్పటికి గంధమాదన పర్వతంపై ఉన్నాడని అందరూ చెబుతారు.

వాలి, సుగ్రీవుల విషయంలో సత్యం ఎవరివైపు ఉందొ వారివైపే తన మద్దతు ఇచ్చి విజయాన్ని సాధించేలా చేసాడు. లక్ష్మణుని ప్రాణాలను కాపాడటానికి ఏకంగా సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడు. శ్రీ రాముడి లాగె శరణన్న వారిని కాపాడే దైవం ఆంజనేయుడు.

Monday 3 June 2013

పురాణాలలో ఖగోళ విశేషాలు

మన భారతీయ పూర్వికులు ఖగోళ విశేషాలను గూర్చి ఎంతో విశ్లేషణ చేసి అనేకానేక ఆసక్తి దాయక విషయాలు మన ముందు పురాణ రూపకంగా ఆవిష్కరించారు. సౌర కుటుంబంలో సూర్యుడు ప్రధానుడని, ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారని తెలియచెప్పారు. యమధర్మరాజు, యమున, శనీశ్వరుడు, తపతి మరియు అశ్వని దేవతలు వీరంతా సూర్యభగవానుని సంతానం. ఇక చంద్రుడు బహు భార్యలను కలిగి, తన కాంతులతో లోకాలన్నీ పావనం చేస్తుంటాడు.

చంద్రుని భార్యలు ఇరవై ఏడుగురు వీరంతా దక్షప్రజాపతి కుమార్తెలైన నక్షత్రాలు. చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రం లో ఉంటూ తన భార్యలను ఆనందపరుస్తూ ఉంటాడు. అలాగే నరులకు పితృదేవతలకు మధ్య సంధాన కర్తగా చంద్రుడు కనిపిస్తాడు. పురాతన కాలం నుండి నేటి విజ్ఞాన యుగం వరకు సూర్యచంద్రులను ఆధారం చేసుకొనే కాలగణన జరుగుతూ వస్తుంది. వీరే కాకుండా బుధుడు, శుక్రుడు, గురుడు, రాహు కేతు, కుజ/అరుణ మరియు శని గ్రహాల గూర్చి పురాణ గాథలు నేటికి అందుబాటులో ఉన్నాయంటే మన పూర్వికుల దూరదృష్టి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. 

భూలోకమే కాకుండా ఇంకా పదమూడు లోకాలు ఉన్నాయి. ఈ లోకాలలో దేవతలు, రాక్షసులు, యక్షలు ఇంకా ఎందరెందరో నివాసం ఉంటారు. లోకాలు రెండుగా విభజించబడ్డాయి అవి ఉర్త్వలోకాలు ఏడు , అధోలోకాలు ఏడు మొత్తం పదునాలుగు లోకాలు. ఉర్త్వలోకాలు వరుసగా భూలోకం, భువోలోకం, సువర్లోకం, మహోలోకం, జనోలోకం, , తపోలోకం మరియు సత్యలోకం. ఇక అధోలోకాలు వరుసగా అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల మరియు పాతాళలోకాలు ఉంటాయి.

సూర్యచంద్రులను రాహుకేతులు కబలించడమే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సంభవించడానికి గల కారణం. దీని వెనక అమృతమధనం నాటి కథ కనిపిస్తుంది. సుర్యచంద్రగ్రహణాలు సంవత్సరంలో కొన్నిమార్లే సంభవిస్తుంటాయి. ఇలా పురాణాలలో ఖగోళ విషయాలు చాల నిక్షిప్తపరిచారు మన పూర్వికులు.

Saturday 1 June 2013

శ్రీ రాముని విశేషాలు

శ్రీ రామ అంటేనే మనలో తెలియని ఆనందానుభూతి కలుగుతుంది. అసలు రామాయణం గురించి తెలిసిన వారు రామున్ని తమ ఇష్ట దైవంగా తప్పకుండ కొలుస్తారు, లేదా తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి సన్నివేశాన్ని శ్రీ రామునితో పోల్చి చూసుకుంటారు. ఏది ఏమైనా శ్రీ రాముడు తన అవతార కాలమందు చేసిన, నడచిన ధర్మ మార్గమే ఆయనకు అంత కీర్తిని సమకుర్చిందని చెప్పవచ్చు. శ్రీ రాముడే ధర్మానికి ప్రతిరూపమని అందరికి తెలిసిన విషయమే.

పూర్వం మహారాజులు అనేక మంది భార్యలను కలిగి ఉండేవారు, కానీ రాజైన శ్రీ రాముడు ఒకే భార్యను కలిగివుండి చిన్న కుటుంబమే చింత లేని కుటుంబమని చెప్పకనే చెప్పాడు. తన తండ్రి మాట జవదాటకుండా అడవులకు సహితం ప్రయాణమయ్యాడు. నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి రాజ్యంలో ఉన్నా అడవుల్లో ఉన్నా తన  కార్యాన్ని ఎంత చాకచక్యంగా చేసుకుపోగాలడొ రామున్ని చూస్తే తెలుస్తుంది. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక యువకుడిగా, రాజుగా నాయకుడిగా ఎలా ఉండాలో శ్రీ రామున్ని గురించి తెలిస్తే అర్థమవుతుంది. శ్రీ కృష్ణుడు చెప్పినట్టు, శ్రీ రాముడు నడచినట్లు ఉండాలని పెద్దలు చెప్తారు.



నేటి సమాజంలో ఉన్న అనేక సమస్యలకు రామాయణం ఒక సమాదానంగా కనిపిస్తుంది. ప్రతి ఇంటా రామాయణ ప్రవచనాలు జరిగితే అసలు లోకంలో జరుగుతున్న ఎన్నో రకాలైన అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చు. రామాయణాన్ని ఒక పాఠ్యాంషంగా విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి. అప్పుడే భవిష్యత్ సమాజం శ్రీ రామ రాజ్యంలా భాసిస్తుంది.