Monday 13 June 2011

ద్వాదశాదిత్యుల విశేషాలు

సూర్యుడు ఒక్కడే కాడని, తానే శివునిగా విష్ణువుగా బ్రహ్మగా ఇంకా పన్నెండు భాగాలుగా విడిపోయి పన్నెండు ప్రధాన కార్యాలను నిర్వర్తిస్తున్నాడని భవిష్యపురాణం డెబ్భై నాలుగో అధ్యాయంలో సూర్యద్వాదశమూర్తి వర్ణనం అనే కథలో కనిపిస్తుంది.
    సూర్యుడు మొదట చంద్రభాగనది తీరంలో తపస్సు చేసాడు. అప్పుడు ఆయన పేరు మిత్ర.. ఇక్కడే శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు సూర్యుడి మూర్తిని ప్రతిష్టించాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి తొలిగా బ్రహ్మదేవుడు, వక్షస్థలం నుంచి శ్రీమహావిష్ణువు, నుదురుభాగం నుంచి శివుడు, పాదాలనుంచి ఇతర దేవత గణాలన్నీ  ఆవిర్భవించాయి.  సూర్యుడు పన్నెండు భాగాలుగా విభజించుకున్నాడు. ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, పూష, త్వష్ట, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, అంశుమంతుడు, విష్ణువు, వరుణుడు, మిత్రుడు, అనే పన్నెండు రూపాలుగా ఏర్పడ్డాడు. మొదటిదైన ఇంద్రమూర్తి దేవరాజ పదవిని అలంకరించి ఉంటుంది. ధాత ప్రజాపతిత్వాన్ని వహించి ప్రాణి సృష్టి చేస్తుంది.
    పర్జన్యుడు సూర్యకిరణాలలో ఉండి అమృతాన్ని వర్షిస్తుంది. పూషుడు మంత్రాలలో ఉండి ప్రజలను పోషిస్తుంటాడు. త్వష్ట వనస్పతులలోను, ఔషదాలలోను ఉంటుంది. ఆర్యముడు ప్రజలను ఆవరించి ఉంటాడు. భగుడు భూమి మీద ఉండే పర్వతాలలో ఉంటాడు. వివస్వంతుడు అగ్నిరూపంలో ఉండి ఆహారాన్ని వండుకోవటంలో సహకరిస్తూ ఉంటాడు. అంశుమంతుడు చంద్రుడిలో ఉంటూ ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. విష్ణువు రాక్షససంహారం చేస్తూ ఉంటుంది. వరుణుడు జలనిధిలో నివసిస్తూ జగత్తుకు జలాన్నిస్తూ ఉంటాడు. మిత్ర లోకహితం కోసం చంద్రభాగానది తీరంలో ఉంటుంది. భక్తులను అనుగ్రహిస్తూ వరాలివ్వడమే మిత్రదేవుడి లక్ష్యం. అందుకే ఆ ప్రదేశానికి మిత్రపదం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడు లోక సంరక్షనార్థం ఇలా వివిధ రూపాలుగా విడిపోయాడు. ఇతర ఏ దేవతలు కనిపించకపోయినా కర్మసాక్షి అయిన సూర్యుడు మాత్రం నిరంతరం కనిపిస్తూనే ఉంటాడు. అణువణువునా ఆయన రూపమే ఇమిడి ఉందని ఆయనను భక్తి ప్రపత్తులతో పూజించడం మేలని భవిష్యపురాణం వివరిస్తుంది.

Monday 6 June 2011

గజచర్మాంబరధారి.. శివధరుడు

సాక్షాత్తు శివున్నే ధరించినవాడు ఎవ్వడు? శివుడు గజ చర్మాన్నే ఎందుకు ధరిస్తాడు? అనే విషయాలను ఈ కథ సందర్భం తెలియచేస్తుంది. పూర్వం కుమారస్వామితో తారకాసుర వధ జరిగిన తరువాత లోకాలన్నీ ఎంతో సుఖంగా ఉన్నాయి. తరువాత అదే తారకాసుర వంశంలో జనించిన వాడే గజాసురుడు. ఇతడు బ్రహ్మ ద్వారా వరాలు పొంది మూడులోకాలను  జయించి వాటిని పాలించసాగాడు. ఇది దేవతలకు ఇబ్బందిగా పరిణమించింది. అంతేకాక గజాసురుడు గొప్ప శివభక్తుడు. ఇతడు నిత్యం శివారాధన చేసేవాడు.
    ఇదిలా ఉండగా ఒకనాడు నారదుడు గజాసురుడి కొలువుకి వచ్చి గజాసురుడి మర్యాదకు ప్రసన్నుడై, నిరంతర శివభక్తి కలిగిన నీవు స్వయం శివున్నే నీ హృదయాన ప్రతిష్టించుకో...అని సూచన చేసాడు. ఇది గొప్ప అదృష్టమని నారదుడు అనడంతో గజాసురుడు వెంటనే పరమేశ్వరుని గురించి గొప్ప తపమాచరించి శివున్ని ప్రసన్నం చేసుకొన్నాడు. అప్పుడు గజాసురుడు శివున్ని వినమ్రంగా నమస్కరిస్తూ, నివోకచోట నేనోకచోట ఉండడం భావ్యం కాదని నిరంతరం తన హృదయంలో ఉండిపొమ్మని కోరుకున్నాడు. భక్తవత్సలుడైన శివుడు అనుగ్రహించి లింగరూపాన్ని ధరించి గజాసురుడి హృదయంలోకి ప్రవేశించాడు.
    రుద్రుడు లేక కైలాసం కల్లోలమైంది. రుద్రగణాలు, ప్రమథగణాలు వెతికి నీరసించిపోయాయి. తిరిగి చేసేది లేక పార్వతిదేవి విష్ణువుని ఆశ్రయించింది. విష్ణువు పార్వతికి అభయమిచ్చి,ఓదార్చి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడికే ఇంద్రాది దేవతలను రప్పించి, వారంతా ఒక గంగిరెద్దుల ఆట ఆడించే వారిలా మారు వేషాలు ధరించి గజాసురుడు ఉండే షోణితపురానికి వెళ్ళారు. ఆ ఆటలో నందీశ్వరుడు గంగిరెద్దుగా, బ్రహ్మ సన్నాయిని వాయించే వాడుగా, ఇంద్రుడు జేగంట కొట్టే వాడుగా, భ్రుంగి వీరణాలు వాయించే వాడుగా వీధుల్లో తిరుగుతూ గజాసురుడి మందిరానికి చేరుకున్నారు. వారు పాడే శివభక్తి గీతాలకు గజాసురుడు ప్రసన్నుడై వారిని పిలిపించి గేయాలను పాడించుకున్నాడు.
    ఆ గేయాలను వింటున్న పరమశివుడు ఆనందిస్తూ, గంగిరెద్దు నాట్యం చూస్తూ తన రూపాన్ని పెంచాసాగాడు. ఇది గమనించిన గజాసురుడు తనకు మరణం తప్పదని భావించి శివున్ని శరణువేడాడు. అప్పుడు శివుడు గజసురుదితో, నీ మరణం ఆసన్నమైనదని ఇంకేదైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు గజాసురుడు తన శిరస్సు పూజార్హత కలిగి ఉండేలా, తన చర్మం శివుడు ధరించేలాగా, జన్మరాహిత్యం కలిగేల వరం ప్రసాదించమని వేడుకొన్నాడు. శివుడు ఆ కోరికను మన్నించి త్రిశులదారియై గజాసురుడి పొట్టను చిల్చుకొని బయటికి వచ్చాడు. తరువాత గజాసురుడి తలను భద్రపరిచారు. గజాసురుడి చర్మాన్ని ధరించి శివుడు గజచర్మాంబరదారిగా ప్రసిద్దికెక్కాడు. గజాసుర సంహారంతో దేవతలంతా సంతోషించారు.

Sunday 29 May 2011

శివుడు చెప్పినట్లు చేద్దాం

శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అంతటి ఆ లయకరకుడు మానవాళికి పుణ్యసంపాదన కొన్ని కొన్ని సులభ మార్గాలని ఉద్దేశించాడు. ఈ విషయాలన్నీ మహాభారతం అనుశాసనిక పర్వంలో ఉన్నాయి. ఒక రోజు పార్వతిదేవి పరమేశ్వరుడిని మానవులు ఏం చేస్తే సులభంగా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చో చెప్పమని అడిగినప్పుడు శివుడు స్వయంగా ఆమెకు ఇలా వివరించాడు.
    ప్రాణాన్ని కలిగి ఉన్న ప్రతి జీవికి నీరు ఎంతో అవసరం. అలాంటి జలాన్ని దానం చేయడం ద్వార స్వర్గ సుఖం కలుగుతుంది. బంగారాన్ని దానం చేస్తే దాతకు పవిత్రత చేకూరుతుంది. గోవు ప్రత్యక్ష దైవమె. అలాంటి గోవును జ్ఞానవంతుడికి దానంమిస్తే ఆ గోవుకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలపాటు దాతకు స్వర్గప్రాప్తి కలుగుతుంది. అందులో కపిల గోవుదానం ఇంకా ప్రశస్తమైనది. భూమిని దానం చేసిన వారికి భూమి ఉన్నంతకాలం స్వర్గసౌఖ్యం కలుగుతుంది. భూమి నుంచి అనేకానేక వస్తువులు ఉద్భావిస్తుంటాయి. కనుక భూమిని దానం చేసిన వారికి ఆయా వస్తువులు దానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది. భూదానం వల్ల ఎన్నెన్నో పాపాలు తొలగిపోతాయి. దానాలలో కన్యాదానంవల్ల దేవతలంతా సంతోషిస్తారు. కన్యదాతకు తేజం, సంపద, కీర్తి కలుగుతాయి.
    విద్యను మంచి శిష్యుడికి దానం చేస్తే దానివల్ల గురువుకు తరిగిపోని ఆనందం కలుగుతుంది. తగిన ధనమిచ్చి పేదలకు విద్యను చెప్పించటం వల్ల విద్యాదాన ఫలం లభిస్తుంది. నువ్వుల రాశిని దానమిస్తే అగ్నిష్టోమయజ్ఞం చేసినంత ఫలం, వస్త్రాలను దానమిస్తే దీర్ఘాయువు, గోడుగుని ఇస్తే బాధలనుంచి విముక్తి, దాసదాసిజనులను దానమిస్తే కర్మ విముక్తి, దీపదానం వల్ల నిర్మలాత్మత. ప్రవాహాన్ని, నదిని దాటడానికి ఎవరికైనా సహయంచేస్తే వ్యసనాల వల్ల కలిగిన పాపాలు తోలగేలాంటి పుణ్యం లభిస్తుంది. అందరూ నడిచే దోవను శుభ్రం చేస్తే సంతానప్రాప్తి, ఔషదాల దానం వల్ల రోగ బాధల నివృత్తి, బాటసారికి ఆశ్రయం ఇచ్చినందువల్ల శరీర సౌఖ్యం కలుగుతాయి.
    యజ్ఞాలు వైదికమని, లౌకికమని రెండు విధాలుగా ఉన్నాయి. రుత్విక్కులకు తృప్తి కలిగేల చేసేది వైదిక యజ్ఞం. దేవతలకు మహోత్సవాలు చేయడం, భజనలు నృత్యాలను ఏర్పాటు చేయడం, గంధం పూలమాలలు దుపదీపాలు నైవేద్యాలు భక్తితో నివేదించటం లౌకిక యజ్ఞం. ఈ రెండు హితమైనవే. చక్కగా శాస్త్రవిధిగా చేసిన యజ్ఞానికి దాన, ధర్మాలు సాటిరావు. దేవతలు మానవుల మనసులను గమనిస్తూవుంటారు కనుక చిత్తశుద్దితో యజ్ఞాలైనా, దానాలైనా చేయాల్సి ఉంటుంది. పితృకార్యాలు చేయడం వల్ల కూడా గొప్పపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈ కార్యాలు చేసేటప్పుడు ఏమరుపాటు లేకుండా ఉండటం ముఖ్యం. సత్ప్రవర్తన కలిగిన వారిని అర్చించి పితృకార్యం చేసే రోజున భోజనం పెట్టి, వస్త్రాలను ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల సర్వత్ర శుభం కలుగుతుందని పార్వతికి పరమేశ్వరుడు వివరించి చెప్పాడు.

Tuesday 24 May 2011

ఉత్తమలక్షణం క్షమ

మనిషికి క్షమాగుణం ఎంతగా ఉపయోగపడుతుందో, జటిలమైన సమస్యలు దీని ద్వారా ఎంత సులభంగా పరిష్కరించబడతాయో కొన్ని పురాణ పరమైన కథలు తెలియజేస్తాయి. ఆ కోవకు చెందిన ఒక కథ రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడి పూర్వచరిత్రకు సంబంధించి ఉంది.
    పూర్వం కుశుడు అనే గొప్ప తపోధనుడు ఉండేవాడు అతడు ఎంతో ధర్మాత్ముడు. ఈయనకు విదర్భ రాజు కుమార్తెతో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు కలిగారు. వీరిలో కుశనాభుడు ఒకడు. ఇతను మహొదయం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యమేలుతు ఉండేవాడు. ఇతడు ఘ్రుతాచి అనే అప్సరసను వివాహమాడాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కలిగారు. వీరు తండ్రి ధర్మలక్షణాలు, తల్లి అందచందాలు కలగలిసి, గొప్ప జ్ఞానవంతులుగా పెరిగి పెద్దయ్యారు.
    ఒక రోజు ఈ రాకుమార్తెలు వన విహారానికి వెళ్లారు. అక్కడ వీరు ఆడుకొంటూ ఉండగా పెద్ద గాలి వీచి వాయుదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ వాయుదేవుణ్ణి చూసి వినయ సంపన్నులైన రాకుమార్తెలు ఆయనకు నమస్కరించారు. వాయువు వారితో తాను ఆ ముగ్గురిని చూసి సమ్మోహితుడైనట్లు చెప్పి తనను వివాహమాడాలని కోరాడు. రాకుమార్తెలు ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. వెంటనే వారు వాయువుతో తాము తండ్రి చాటు బిడ్డలమని, వివాహం విషయంలో తండ్రి అనుమతి లేనిదే తామేమి మాట్లాడబోమని అన్నారు.వాయుదేవుడు తనను పెళ్లాడితే నిత్య యౌవ్వనం లభిస్తుందని, కాదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. అయిన ఆ ముగ్గురు రాకుమార్తెలు తండ్రి మాటే తమదని కచ్చితంగా తెగేసి చెప్పారు. దాంతో వాయుదేవుడికి కోపం వచ్చి ఆ ముగ్గురిని అందవిహీనులై, గూని వారుగా మారిపొమ్మని శపించి వెళ్ళిపోయాడు. అయిన వారు బాధ పడలేదు, వారికి వాయుదేవుడిని శపించెంత శక్తి ఉన్న వారు ఆ పని చేయలేదు. తండ్రి దగ్గరికి వచ్చి విషయాన్నంతా వివరించారు. కుశనాభుడు తన కుమార్తెలకు తగిన వరుణ్ణి వెదికి బ్రహ్మదత్తుడనే గొప్ప తపోశక్తి కలిగిన రాజుకి ఇచ్చి వివాహం చేయించాడు. దాంతో వారికి శాపం తొలగిపోయి వారి నిజరూపాలు వచ్చాయి. కుశనాభుడు తర్వాత పుత్రకామేష్టి యాగం చేసి గాధి అనే కుమారున్ని పొందాడు. గాధికి విశ్వామిత్రుడు, సత్యవతి జన్మించారు. సత్యవతి విశ్వామిత్రుడి అక్క.
    ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది రాకుమార్తెల క్షమాగుణం. తమకు వాయుదేవుణ్ణి శపించెంత శక్తి ఉన్నప్పటికీ క్షమ గుణాన్ని ప్రదర్శించి ఓర్పు వహించారు. విషయం మరింత తీవ్రం అవ్వకుడదని వాయువు పై కోపాన్ని చూపక తమ తండ్రికి విషయాన్నీ తెలియజేసారు. కొద్దిగా ఆలోచిస్తే ఓర్పు, క్షమా అనే గుణాల్ని కలిగి ఉండటం మేలు అని తెలియజేస్తుంది ఈ కథ సందర్భం.

Saturday 21 May 2011

పుణ్యదాయిని విష్ణుప్రియ తులసి

కార్తిక పురాణం తులసి మహిమను వివరిస్తుంది. జలంధరుడికి, పరమేశ్వరుడికి ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగింది. బ్రహ్మదేవుడి సహాయంతో ఈశ్వరుడు తన చక్రాయుధంతో జలంధరుడిని చేదించాడు. ఆ జలంధరుడి నుండి వెలువడిన కాంతి ఈశ్వరుడిలో కలిసిపోయింది. రాక్షసుడి మరణంతో దేవతలంతా ఆనందించారు. అప్పుడే దేవతలకు మరొక సమస్య ఎదురయింది. బృంద మోహంలో ఉన్న విష్ణువు ఆమె ఆహుతి అయిన ప్రదేశంలో సంచరించసాగాడు. అప్పుడు దేవతలంతా ఆ మహామాయను శరణువేడారు. ఆమె సంతసించి విష్ణువు మొహం నుంచి తేరుకోవడానికి తాను సరస్వతి, లక్ష్మి, పార్వతుల అంశాలు నిండిన కొన్ని బీజాలను దేవతలకిస్తున్నట్లు, వాటిని తీసుకెళ్ళి బృంద ఆహుతై విష్ణువు తిరుగుతున్న ప్రాంతంలో చల్లమని చెప్పింది. దేవతలు అల చేయగానే అక్కడ ఉసిరి, తులసి, మాలతి అనే మొక్కలు ఆవిర్భవించాయి. సరస్వతి అంశతో ఉసిరి, లక్ష్మి అంశతో మాలతి, పార్వతి అంశతో తులసి ఆవిర్భవించాయి.
    ఈ మూడింటిని విష్ణువు తిలకించసాగాడు. ఇందులో లక్ష్మి అంశతో ఉన్న మాలతి ఈర్ష్య స్వరుపినిగా కనిపించి విష్ణువుకు దూరమయింది. తులసి, ఉసిరి మాత్రం ఇసుమంతైన అసూయ లేకుండా అనురాగపురితంగా ఉండడంతో విష్ణువు మనస్సును ఆకర్షించాయి. అప్పుడు విష్ణువు మొహం తొలగిపోయి తులసి, ఉసిరి సమేతంగా దర్శనమిచ్చాడు.
    తులసి వనం ఉన్నచోట పుణ్యతీర్థం ఉన్నట్లే లెక్క. సర్వపాపాలను నశింపచేస్తుంది. తులసి సేవనం గంగాస్నానం, నర్మదా దర్శనంతో సమానం. ఈ మొక్కను నాటిన, తాకిన, పెంచినా సర్వపాపాలు హరిస్తాయి. ద్వాదశి నాడు మాత్రం ఎవరూ తులసిదళాలను కోయకూడదు. ఉసిరి చెట్టు కూడా అత్యంత పవిత్రమయినదని కార్తిక పురాణం పేర్కొంటోంది. ఉసిరి కాయలను తాకిన, పాత్రలతో కాని, కాయలతో కాని దేవతపూజ చేసినా అత్యంత పుణ్యదాయకమవుతుంది. సమస్త దేవతలు కార్తిక మాసంలో ఉసిరిచెట్టుని ఆశ్రయించి ఉంటారు. ఈ చెట్టు నీడన కార్తికంలో భోజనంచేస్తే సంవత్సర పాపదోషం నశిస్తుంది. ఈ చెట్టు నీడన విష్ణుపూజ పుణ్యదాయకం. ఇలా ఉసిరి, తులసి మహాత్మ్యాన్ని కార్తీకపురాణం పేర్కొంటోంది. నేటి కాలంలో కూడా తులసి, ఉసిరి గుణాలను ఎన్నింటినో మనం గుర్తిస్తూనే ఉన్నాం.

Sunday 15 May 2011

పురాణాలలో ధ్యానం

ధ్యానం గురించి పురాణాలలో చాల చోట్లలో ప్రస్తవితమైవుంది. ధ్యాన యోగాన్ని అవలంబించేవారు మనసులో ఎవరిని ధ్యానించాలి? ఎలా ధ్యానించాలి? ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను వ్యాస భాగవతంలోని రెండో అధ్యాయంలో ఉన్న ఈ ఒక కథ సందర్భం వివరిస్తుంది.
    యోగి ఒక విషయాన్నీ గమనించాలి. అదేమంటే ఆ అనంత స్వరూపుడైన ఆ పరంధాముడు మనిషి చిత్తంలోనే ఉన్నాడు. దీనినే ఆత్మ అని అంటారు. ఇది అసత్యం కాదు, దీనికి అసలు నాశనం లేదు. దీనినే ధ్యానాన్ని అవలంబించే యోగులు తమ మనసులో ధ్యానించాలి. అప్పుడే అవిద్య అంతరించిపోతుంది. ఇలా కాక మరో పద్ధతిలో కూడా ధ్యనించవచ్చు. ధ్యానించేవాడు తన చిత్తంలోని భగవంతుడిని గుర్తించి ధ్యానించలేనప్పుడు ఆ భగవంతుడి స్వరూపాన్ని మనసులో నిలుపుకొని ధ్యానించవచ్చు. ఆయన స్వరూపం ఒక క్రమపద్ధతిలో ఇలా ఉంటుంది.
    ఆ స్వామి శంఖ, చక్ర, గదా పద్మాలతో నాలుగు చేతులతో ఉంటాడు. పద్మపత్రాల్లాంటి కళ్ళుంటాయి. కదంబ కేసరాల్లాగా పచ్చని రంగులో ఉండే పట్టు వస్త్రాలను ధరించి ఉంటాడు. రత్నాలు చెక్కిన బంగారు కడియాలు చేతులకు, ఉజ్వలమైన మణులతో ధగధగలాడే కిరీటాన్ని ధరించి ఉంటాడు. చెవులు రత్నకుండలాలతో మెరిసిపోతుంటాడు. హృదయం మీద శ్రీవత్స చిహ్నం, కౌస్తుభమణి ప్రకాశిస్తూ ఉంటాయి. అన్నిటికి మించి వెలుగొందే వనమాలను ధరించి ఉంటాడు. అలాంటి ఆ నారాయణుని పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని ధ్యానించాలి యోగులు. నడుముకు రత్నాల మొలతాడు, వేళ్ళకు బంగారు ఉంగరాలు, కాళ్ళకు మూపురాలు, చేతులకు కంకణాలు ధ్యానించే వారికి స్పష్టంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ స్వామి నుదిటి మీద ఉంగరాలు తిరిగిన నల్లటి ముంగురులు కదలాడుతూ కనిపిస్తాయి. చిరునవ్వుతో కళకళలాడే ఆ స్వామి ముఖం, నవ్వుతు నాట్యమాడే కనుబొమ్మలతో నిరంతరం అనుగ్రహ వీక్షణాలతో ఉండే ఆ స్వామి ధ్యానించే వారికి ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటాడు. యోగి ఇలాంటి దివ్యముర్తిని తన మదిలో ధారణ నిలిచినంతసేపు ధ్యానం చేస్తూ ఉండాలి.
    ఆయన పాదాలు మొదలుకొని ముఖం వరకు ప్రతి అంగాన్ని ధారణ పూర్వకంగా ధ్యానించాలి. మనస్సును ఆయన మీద తప్ప మరెక్కడా నిలపకూడదు. బుద్ధిని నిశ్చలంగా, పవిత్రంగా ఉండేలా చూడాలి. ఇతర విషయాలపై మనసును పోనివ్వకుండా ఏకాగ్ర చిత్తంతో స్వామిని ధ్యానించాలి. ముందుగా సుఖాసనం మీద కూర్చొని ప్రాణయామం చేయాలి. అలా ప్రాణవాయువుని నిరోధిస్తు ఇంద్రియాలను గెలవటం అలవాటు చేసుకోవాలి. నిర్మల బుద్ధితో మనసుని స్థిరపరచి తిరిగి బుద్ధిని ఆత్మతో స్థిరపరచాలి. ఇలా ఆత్మను అంతరాత్మలో లీనం చేయాలి. అంతరాత్మను పరమాత్మతో అనుసంధానం చేసి శాంతిమయ స్థితిలో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈ స్థితిలో రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఏదీ ఉండదు. అహంకారం, మహత్తత్వం, ప్రకృతి లాంటివేమీ ఉండవు. యోగి ఈ స్థితికి చేరుకోవాలి. ఈ స్థితి ఉత్తమోత్తమ స్థితి. అతడు అవిద్య నుంచి విముక్తుడవుతాడు.

Tuesday 10 May 2011

అదితి ఆదర్శ అమ్మతనం


అధర్మం లోకంలో రాజ్యమేలుతున్నప్పుడు అమ్మలంతా ఏం చేయాలి ఎలా ఉండాలి అనే విషయాల్ని మత్స్య మహాపురణంలోని వామన చరితంలోని ఒక కథ సందర్భం వివరిస్తుంది. పూర్వం దైత్యులు దేవతల మీదకి దండెత్తి వారిని రాజ్యహీనులను చేసి సాధుజనులను, సత్పురుషులను, ఇతర ధర్మాత్ములను హింసిస్తూ వారికి భూమిపై చోటు లేకుండా చేసి అధర్మం ధర్మం లాగ చెలామణి అయ్యెలా చేయసాగారు. ఎవరైనా మంచివారు ఎదురుతిరిగితే వారికి అపజయమే ఎదురయ్యేది. ఇదంతా కశ్యపుడి భార్య అయిన అదితికి ఎంతో బాధ కలిగించింది.
    దీనిని ఎవరు అణచలేర? అని ఆమె చాలా ఆలోచించింది. ఎవరో అణచాలని తను ఎదురుచూడటం ఎందుకు నేనే ఒక ప్రయత్నం చేయవచ్చుకదా అని ఆ అణచగల ధీరుడు తనకు కుమారుడుగా కావాలని అనుకొంది. వెంటనే ఆ శ్రీమహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకొని తన కోరిక విన్నవించుకోంది. ఈ సమాజంలో అధర్మం రాజ్యమేలుతుందని, తనకు కొడుకుగా శ్రీహరియే ఉదయించి జరుగుతున్న ఇదంతా అణచివేయాలని వరమడిగింది. ధర్మానికి హాని కలిగినప్పుడు తానవతరించి ఆ ధర్మాన్ని కాపాడడమే శ్రీహరి లక్ష్యం కనుక ఆమెకు జన్మిస్తానని వరమిచ్చాడు.
    శ్రీమహావిష్ణువు వరంతో ఆమె గర్భందాల్చింది. ఒక శుభ ముహూర్తాన వామనావతారుడైన శ్రీహరి జన్మిస్తాడు. ఆ క్షణాన దేవతలంతా ఆ దేవదేవుడిని స్తుతించారు. దైత్యులకు అపశకునాలు ఎదురయ్యాయి. సజ్జనుల మనసులు పులకించి పోయాయి. ఆ చిన్నారి వామనుడికి బ్రహ్మదేవుడు కృష్ణాజినాన్ని, బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, మరీచి ఆషాడదండాన్ని, వసిష్టుడు కమండలాన్ని, అంగిరుడు దర్భలను, పులహుడు రుద్రాక్ష దండను, పులస్త్యుడు తెల్లని వస్త్రాలను బహూకరించారు. ఆ వెంటనే వేదాలు అనేక శాస్త్రాలు లాంటివన్నీ వచ్చి ఆ స్వామిని ఆశ్రయించాయి. ఇక వామనుడు వీటన్నింటిని ధరించి ధర్మసంస్థాపన కోసం అడుగులు వేశాడు.
    ఈ కథ సందర్భంలో చక్కటి సందేశం ఉంది. సమాజంలో అన్యాయం పెరుగుతున్నప్పుడు, అధర్మం నడుస్తున్నప్పుడు కాలం వృధా చేయకుండా ఎవరికీ వారు తమ స్థాయిలో తగిన ప్రయత్నం చేయాలని, తల్లులు తమ బిడ్డలు అధర్మాన్ని జయించి, ధర్మాన్ని నిలబెట్టగలిగిన వారుగా ఉండాలనే దీక్షతో బిడ్డలను కని పెంచాలని, ఇలా ధర్మాన్ని కాపాడాలని చెబుతుంది.

Thursday 5 May 2011

ముచుకుంద వరదుడు

 ఇది భాగవతంలోనిది. పూర్వం సూర్యవంశంలో మాంధాత చక్రవర్తి ఉండేవాడు. ఈయన కుమారుడే ముచుకుందుడు. ముచుకుందుడు మంచి పేరు తెచ్చుకొని రాజ్యపాలన చేస్తుండేవాడు. ఆ సమయంలో దేవదానవ యుద్దంలో దేవతల పక్షాన నిలిచి నాయకత్వం వహించే వారు లేకపోయారు. అప్పుడు దేవతలు ఈ భాద్యత ముచుకుందుడికి అప్పగించారు, ముచుకుందుడు కూడా చాలాకాలం పాటు యుద్ధం చేసి దేవతలకు విజయం కలిగించి ఆనందపరిచాడు.
    అప్పుడు దేవేంద్రుడు ముచుకుందుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. తను అలసిపోయానని హాయిగా నిద్ర పట్టే వరం ఇవ్వమని మధ్యలో ఎవరైనా తనకు నిద్రాభంగం కలిగిస్తే తన చూపు సోకి భస్మమై పోయేలా వరం కావాలన్నాడు. దేవతలు ఆ వరం ప్రసాదించారు. తరువాత అయన మధురకు సమీపంలో ఉన్న ఒక కొండగుహలో నిద్రకు ఉపక్రమించాడు. ఇలా చాల కాలం గడిచింది, ద్వాపర యుగం వచ్చింది.
    ఆ కాలంలో కాలయవనుడు అనే రాక్షసుడు లోకలన్నిటికి కంటకుడిగా మారాడు. రాజులందరిని ఓడిస్తూ ఉండేవాడు. ఓ రోజు నారదుడు ఎదురై ఎందరో రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడిని జయించమని సలహా ఇస్తాడు. ఆ మాటలను విన్న రాక్షసుడు శ్రికృష్ణుడి మీదకు దండెత్తుతాడు. అప్పుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు తన లీలలను ప్రదర్శిస్తాడు. శత్రువు దొరకలేదని ఉక్రోషంగా ఉన్న రాక్షసుడికి శ్రీకృష్ణుడు నిరాయుధుడై పారిపోతున్నట్లు కనిపించి, ధర్మాన్ని కాపాడటానికి వైష్ణవ మాయను ప్రదర్శించి ముచుకుందుడు నిద్రిస్తున్న గుహవైపు వెళ్లి లోపల దాగాడు. శ్రీకృష్ణుడిని అనుసరిస్తూ వచ్చిన ఆ రాక్షసుడు అక్కడ పడుకున్న ముచుకుందుడే శ్రిక్రుష్ణుడని భ్రమించి ఆయన్ని కాలితో తన్నాడు. నిద్రాభంగమైన ఆ ముచుకుందుడి చూపు సోకి ఆ రాక్షసుడు భస్మమై పోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ముచుకుందుడికి దర్శనం ఇచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు. తనకు నిత్యం భగవంతుడిని ఉపాసించే వరం కోరి పొందుతాడు. దైవం ముచుకుందుడి లాంటి వారిని దుష్ట సంహారం గురించి ఒక సాధనంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇదంతా ధర్మసుక్ష్మాన్ని అనుసరించి జరిగింది.

Sunday 1 May 2011

హితులు సన్మార్గదర్శకులు

విశ్వామిత్రుడు అనగానే కోపానికి ప్రతీకగా కొందరు భావిస్తుంటారు. కానీ ఆ మహార్శిలో ఇంకా ఎన్నెన్నో ఆదర్శ గుణాలు ఉన్నాయి. ఆయన హితైషి. ఆయన గురించి స్వయంగా విశిష్ట మహర్షి తెలియజెప్పిన కథ సందర్భం ఒకటి రామాయణ బాలకాండ ఇరవై ఒకటో సర్గలో కనిపిస్తుంది.
    దశరథుడు మహారాజు విశ్వామిత్రుడికిచ్చిన మాట ప్రకారం తన పుత్రులను పంపడం ఇష్టం లేదని వారు పెళ్లి కావలసినవరైనప్పటికి ఇంకా పసివారని, రాక్షస సంహారం చేయలేరని విశ్వామిత్రుడికి చెప్పాడు. దశరథుడు ఇలా సందిగ్ధస్థితిలో ఉండడం చూసి విశ్వామిత్రుడికి దశరథుడిపైన కోపం వచ్చింది వెంటనే ఆయన దశరథుడిని హెచ్చరిస్తూ మాట తప్పడం నీ వంశానికే కలంకమని, నీవరితో నీవు సుఖంగా ఉండు అని కోపోద్రిక్తంగా అన్నాడు. అలా అంటూ ఉండగానే భూమండలం అంత కంపించింది. దేవతలు భయగ్రస్తులయ్యారు. ఇదంతా వశిష్ట మహర్షి చూసి దశరథుడికి సత్యమేదో తెలియచెప్పడానికి చేసిన ప్రయత్నం ఒక వ్యక్తి కష్టకాలంలో ఉన్నప్పుడు మంచేదో, చెడేదో చెప్పే ప్రయత్నం చేయాలన్న ఆర్యోక్తిని ఇక్కడ ఆయన అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది.
     వశిష్టుడు దశరథుడిని అనునయిస్తూ...ఆడిన మాట నిలబెడితే అశ్వమేధ యాగఫలం దక్కుతుంది, మాట తప్పితే పూర్వ పుణ్యఫలం నశిస్తుంది. విశ్వామిత్రుడు అసామాన్యుడు, అయన రక్షణలో రాముడు అగ్ని రక్షణలో ఉన్న అమృతంలా చక్కగా ఉంటాడు.కనుక నిస్సందేహంగా రామలక్ష్మణులను అయన వెంట పంపవచ్చు. మూడు లోకాల్లో ఆయనను మించినవాడు, అస్త్ర ప్రయోగాలూ తెలిసిన వాడు ఎవరు లేరు కనుక రాముడిని పంపాలి.ధర్మాత్ముడైన ఆ రుషి తానే స్వయంగా రాక్షసులను నిగ్రహించగల సమర్థుడే కాని రామలక్ష్మణులకు మేలు చేయడానికే నిన్ను ఇలా అభ్యర్తిస్తున్నాడు అని వశిష్టుడు దశరథుడికి విశ్వామిత్రుడి విశిష్టత గురించి చక్కగా వివరించి చెప్పాడు. అప్పటి వరకు స్వార్థంతో, ప్రేమతో నిండిన ఆ రాజు మనస్సు మారి ఒప్పుకున్నాడు.
    సందిగ్ధ అవస్తలో ఉన్న వ్యక్తికి చక్కటి ఉపాయం చెప్పే హితుడికి ప్రతిరూపంగా వశిష్టుడు ఈ ఘట్టంలో కనిపిస్తాడు. వశిష్టుడి మాటలు విన్న తరువాతే రామలక్ష్మణులను విశ్వామిత్రుడివెంట పంపడానికి దశరథుడు అంగీకరించాడు.ఈ కథ సందర్భం విశ్వామిత్రుడి విశిష్టత గురించి, ప్రతి మనిషి జీవితంలో హితుల పాత్ర ఏ మేరకు ఉంటుందో సూచనప్రాయంగా తెలియజేస్తుంది.

Tuesday 19 April 2011

ఇహపరలోక విశేషాలు

పరము అంటే ఏమిటి? పరలోకాలు అని వేటినంటారు? అనే విషయాలుకు మార్కండేయ పురాణంలోని వివరణ కన్పిస్తుంది. ఏ జీవుడైనా పుట్టడానికి తన పూర్వజన్మలో తాను చేసిన సుకృత, దుష్కృతకర్మలే ప్రధాన కారణం. అలంటి జన్మలను ఎన్నింటినో పొందుతుంటాడు. గత జన్మలలోని కర్మఫలం మంచిదైతే జీవుడు స్వర్గాది భోగాలను అనుభవిస్తాడు. ఆ కర్మఫలం నీచమైనదైతే నరకలోక బాధలను పొంది, ఆ తర్వాత పశుపక్ష్యాది జంతువులలో జన్మిస్తాడు. అటు చెడుకి, ఇటు మంచికి మధ్యమ ఫలం ఉన్న కర్మ వల్ల కొంత వరకు మనిషిగా పుట్టడానికి వీలు ఉంది. ఈ కర్మఫలమే మరో మూడు రకాలుగా ఉంది. సంచితం, ప్రారబ్ధం, ఆగామి అనేవి ఆ మూడు రకాలు. సంచితం అంటే పూర్వ జన్మలలో సంపాదించుకొన్న కర్మల వల్ల సమకూరిన ఫలితం. ప్రారబ్ధం అంటే పూర్వజన్మలో చేసిన కర్మలవల్ల ఈ జన్మలో అనుభవిస్తున్న ఫలితం. ఆగామి అంటే ఈ జన్మలో చేసి భవిష్యత్ జన్మలో అనుభవించడానికి సిద్ధంగా ఉనా కర్మ ఫలం. ఇంతకు ముందు ఏడు జన్మలలో చేసిన కర్మ మానవుడికి ప్రస్తుత జన్మలో అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రారబ్ధాన్ని ప్రతి మనిషి పురుషుడైన, స్త్రీ అయినా ఎలాంటి బేధము లేకుండా ఎవరు చేసింది వారు అనుభవించక తప్పదు. గత జన్మలలో మంచి చేసుకొని ఈ జన్మలో మోక్షాన్ని పొందొచ్చు. మోక్షమంటే జీవుడు దేవుడిలో లీనం కావటం. ఇలా మోక్షాన్ని పొందగల శక్తి, అర్హత మనుషులకు తప్ప పశుపక్ష్యాదులకు ఇతర జంతువులకు లేదు.
    అందుకే అన్ని జన్మలలో మానవ జన్మ విలువైనది, గొప్పది. పశుపక్ష్యాదులు ఇదివరకు చివరి జన్మలో పొందిన మానవజన్మలో చేసిఅన పాపపు ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాయే తప్ప ఆగామికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకొనే అవకాశం ఉండదు. వాటికీ మానవులకు ఉన్నట్లుగా బుద్ధి, జ్ఞానం అనేవి ఉండవు. బుద్ధి పూర్వకంగా చేసిన కర్మఫలమే అనుభవించడానికి వీలుగా ఉంటుంది. బుద్దిలేని కారణంగా పశుపక్ష్యాదులు పుణ్యాన్ని సంపాదించుకోవటం దాదాపు లేనట్లు గానే పెద్దలు చెపుతారు. ఎక్కడో ఒకటి రెండు సందర్భాల్లో అది దైవసంకల్పం వల్ల పశువు, పక్షి లాంటివి వాటికీ తెలియకుండానే దైవ కార్యంలో పాలుపంచుకున్నప్పుడు మోక్షప్రాప్తి కలిగినట్లు పురాణాలలో ఒకటి రెండు కథలలో కనిపిస్తున్నాయి. పశుపక్ష్యడులకన్న భిన్నంగా ఉండేందుకే దైవం మనిషికి బుద్ధిని అనుగ్రహించాడు ఆ బుద్ధిని వికసింపజేసుకోవడానికి విద్య ఎంతో ఉపకరిస్తుంది. విద్యాభ్యాసం వల్ల వినయము, దీనివల్ల ధనము సంపాదించుకోవచ్చు. దానం వల్ల దాన, ధర్మాలు చేసే శక్తి రావటం, ఆ కార్యాల వల్ల ఇహ పర సుఖాలను పొందడం అనేది జరుగుతుంది. విద్య వల్ల పాపం ఏమిటో, పుణ్యం ఏమిటో మనిషి తెలుసుకోగలడు. విద్య వల్ల ఎక్కువ జ్ఞానాన్ని పొంది ఇహలోక సుఖాలు క్షనికమని తెలుసుకొని, పరలోక సంబందమైన మోక్షప్రాప్తి కోసమే కృషి చేసేందుకు మనిషికి అవకాశం కలుగుతుంది. ఇహలోకంలో సుఖలనుభావించడానికి కావలసిన జ్ఞానం వేరు, పరలోక సంబంధంగా ఉన్న మోక్షాన్ని జ్ఞానాన్ని పొందడం వేరు.
    పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానమంటారు. సద్గురువు దగ్గర ఉపదేశం పొంది ఆయన చెప్పిన మార్గంలో ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. పరలోకాలు ప్రధానంగా నాలుగున్నాయి. వాటిలో మొదటిది స్వర్గం. దీనికి దేవేంద్రుడు అధిపతి. రెండోది బ్రహ్మలోకం, దీన్నే సత్యలోకమని అంటారు, బ్రహ్మ అధిపతి. మూడో లోకం కైలాసం, దీనికి ఈశ్వరుడు అధిపతి. నాలుగో లోకం పేరు వైకుంఠం. దీనికి అధిపతి శ్రీమహావిష్ణువు. ఈ అనుభవించాల్సిన సుఖలన్ని అనుభవించాక ఆ జీవుడు మళ్ళి భూలోకంలో జన్మిస్తాడు. శాశ్వతంగా పరలోకాలలో భగవంతుడిలో లీనమై ఉండాలనుకుంటున్నవారు తమ జన్మంతా మంచిని ఆచరిస్తూ ముందుకు సాగాలని మార్కండేయ పురాణం పేర్కొంటోంది.

Sunday 17 April 2011

బ్రహ్మరాత ఎలా ఉంటె అలా...

సర్వసాధారణంగా సమాజంలోని పెద్దలు "బ్రహ్మ రాత ఎలా ఉంటె అలా జరుగుతుంది", "ఆయన ఇచ్చిన ఆయుష్హు ఉన్నంత వరకు బతుకుతూనే ఉంటాం" అని అంటూ ఉండడం కనిపిస్తుంది. అలాంటి మాటలకు ఓ ఉదాహరణగా రావణాసురుడి కథే కనిపిస్తుంది.
    రావణాసురుడు బ్రహ్మ దగ్గరి నుంచి వరాలు పొందిన తర్వాత దేవతలు, ఋషులు సహా సర్వలోకాల్ని బాదించసాగాడు. రాక్షసానందంతో ఆ అసురుడు పుష్పక విమానమెక్కి లోకాలన్నింటి మీదకు దండెత్తుతున్న సమయంలో ఒకనాడు ఆకాశమార్గాన నారదముని ఎదురయ్యాడు. నారదుడికి నమస్కరించి రావణుడు కుశల ప్రశ్నలు అడిగాడు. నారదుడు ఎంతో సంతోషించి రావణుడి ప్రయాణ కారణమేమిటని అడిగి తెలుసుకున్నాడు. దేవతలందరినీ జయించడమే తన ప్రయాణపు లక్ష్యమని రావణుడు చెప్పాడు. అప్పుడు నారదుడు అంతగా కష్టపడి అందరి మరణానికి కారకుడైన యమధర్మరాజును జయించినందువల్ల ఎక్కువ ఫలితం ఉంటుందని, ఆ ప్రయత్నం చేసి చూడాలని చెప్పాడు. యమపురికి వెళ్ళే మార్గం చాల కష్టతరమైందని నారదుడు రావణుడిని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక ఆ రాక్షసుడికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లైంది. రావణుడు వెంటనే యమపురికి బయలుదేరాడు.
    ఇంతలో నారదుడు వెళ్లి యమధర్మరాజుకు రావణాసురుడు యుద్ధానికి వస్తున్నట్లు చెప్పాడు. నారదుడు అలా చెప్పుతున్నంతలోనే గొప్ప కాంతులతో విరాజిల్లుతున్న పుష్పక విమానమెక్కి రావణాసురుడు యమలోకంలో ప్రవేశించాడు. ఎన్నో పాపాలు చేసి వాటికి తగిన ఫలితాన్ని అనుభవిస్తున్న ఎందరెందరినో రావణాసురుడు అక్కడ చూసాడు. భయంకరమైన రూపాలు కలిగిన యమకింకరులు అక్కడ ఉన్నారు. ఆ కింకరులు పెట్టె బాధలకు తట్టుకోలేక పాపం చేసిన వారంతా ఏడుస్తూ ఉండడం కనిపించింది. కొంత మంది పురుగులకు, మరికొంతమంది కుక్కలకు ఆహారంగా అయిపోయి భయంకరంగా కేకలు పెట్టడం కనిపించింది. మరికొంతమంది రక్త ప్రవాహంతో ఉన్న వైతరణి నదిని దాటి కాలుతున్న ఇసుకలో దొర్లాడుతూ పెడబొబ్బలు పెడుతూ యాతనలు పడుతున్నారు. మరికొంతమంది పున్యత్ములను ఆ పక్కనే ఉన్న ప్రదేశంలో రావణుడు చూసాడు. గీత వాద్యాలను వింటూ కొంత మంది సంతోషిస్తున్నారు. గోదానం చేసిన వారు పాలను, అన్నదానం చేసిన వారు గృహవాస సుఖాన్ని అనుభవిస్తూ కనిపించారు. యమభటుల చేతిలో బాధలు అనుభవిస్తున్న పాపాత్ములు కొంత మందిని బాధ అనుభవించకుండా రావణుడు పక్కకు లాగాడు. పాపులకు తగిన శిక్ష అనుభవించకుండా రావణుడు అలా అడ్డుకోవడంతో యమభటులకు కోపం వచ్చింది. వెంటనే ఆ భటులంతా రావణాసురుడినీ, అతడి సైన్యాన్ని ఎదుర్కొన్నారు. రావణాసురుడు ఎక్కి వచ్చిన పుష్పక విమానాన్ని చుట్టుముట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా విరిచి వేసారు. బ్రహ్మ వరం కారణంగా ఆ పుష్పక విమానం మళ్లీ మాములుగా ప్రత్యక్షమైంది. యమభటులు, రావనసేన ఘోరాతిఘోరంగా యుద్ధం చేయసాగారు. యమభటులు మంత్రులను విడిచిపెట్టి రావణాసురుడిపైకే శూలవర్శన్ని కురిపించారు. ఆ బాధను తట్టుకోలేక ఆయన కింద పడిపోయారు, కవచం పడిపోయింది, కొద్ది క్షణాలు ఆగి మళ్లీ లేచి పాశుపతాస్త్రాన్ని సంధించాడు. యమభటులు ఒక అడుగు వెనక్కి వేశారు. వెంటనే రావణుడు అతడి మంత్రులు జయజయధ్వానాలు చేశారు.
    ఆ శబ్దం యమధర్మరాజుకు వినిపించి శత్రువును జయించడానికి తానే స్వయంగా బయలుదేరాడు. ఆయన వెంట మూడు లోకాలను నాశనం చేయగలిగిన శక్తి ఉన్న మృత్యుదేవత బయలుదేరింది. యమధర్మరాజు కాలపాశంతోను, ముద్గురం లాంటి ఆయుధాలతోను రావణుడి మీద అగ్రహించి బయలుదేరాడు. అలా కోపంతో వస్తున్న యమధర్మరాజుని చూసి రావణాసురుడి మంత్రులంతా తలా ఒక దిక్కుకు భయంతో పరుగెత్తారు. యమధర్మరాజు రాకను రావణుడు మాత్రం లెక్కచేయలేదు. అలాగే మొండిగా నిలుచున్నాడు. యముడు మరీ కోపంతో తన దగ్గరున్న శక్తి, తోమరం అనే ఆయుధాలను రావణుడిపైకి విసిరాడు. ఆ ఆయుధాల దెబ్బలు తగిలినా రావణాసురుడు లెక్క చేయకుండా అలాగే నిలబడ్డాడు. ఆ యుద్ధం చూడటానికి దేవతలు, గంధర్వులు, ఋషులు, బ్రహ్మదేవుడు సహా అక్కడికి వచ్చారు. రావణాసురుడు తన విల్లును ఎక్కుపెట్టి మృత్యుదేవత పైకి నాలుగు బాణాలు, యముడి మీదకు అనేకానేక బాణాలను వదిలాడు. అందుకు కోపించిన యముడు ముక్కుపుటలనుంచి గొప్ప అగ్నిజ్వాలలు బయలుదేరాయి. ఆ అగ్ని రావణాసురుడిని దాహిస్తుందని మృత్యువు, యముడు అనుకున్నారు. అలా జరగక పోయేసరికి మృత్యువు యముడితో తనను రావణుడి మీదకు వదలాలని, వాడిని నాశనం చేసి వస్తానని పలికింది. యముడు తానే స్వయంగా రావణుడిని సంహరించాలని తన చేతిలో ఉన్న కాలదండాన్ని పైకెత్తాడు, శత్రువు మీదకి దాడి చేయడానికి సిద్ధంగా కాలపాశం, ముద్గరం లాంటి ఆయుధాలు సిద్ధమయ్యాయి.
    ఆ తీవ్ర పరిస్థితి చూసి దేవతలంత గజగజ వణికిపోయారు. బ్రహ్మదేవుడు కల్పించుకొని యముడిని వారించాడు. కాలదండం ప్రయోగిస్తే రావణుడు మరణించడం తప్పదని, అలా జరిగితే అతడికి తానిచ్చిన వరం విఫలమైనట్లుగా అవుతుంది కనుక కోపాన్ని ఉపసంహరించుకోవాలని బ్రహ్మదేవుడు యముడికి నచ్చజెప్పాడు. బ్రహ్మ మాటలను గౌరవించి యముడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. రావణాసుర చరితంలోని ఇలాంటి సన్నివేశాలు, ఆ రాక్షసుడు బ్రహ్మ వళ్ళ వరం పొంది దేవతలను ఎంతగా ఇబ్బంది పెట్టాడో విశదం అవుతుంది. ఇలాంటి అనేకానేక కారణాలు రామావతారంలో విష్ణువు భూలోకానికి రావడానికి దారితీశాయి.

Friday 15 April 2011

ఈ జగం ఎవ్వనిలో నుంది



ఈ జగత్తునంతా నిరంతరం భరిస్తున్నవాడు ఎవ్వడు? అందరిని తన కడుపులో దాచుకొని కాచి కాపాడుతున్నవాడు ఎవ్వడు? అనే ప్రశ్నలకు సమాధానం పద్మనాభుడు అని అంటోంది విష్ణుధర్మోత్తర పురాణం డెబ్బై తొమ్మిదో అధ్యాయంలోని మార్కండేయ పద్మనాభోపఖ్యానం. ఆ అనంతపద్మనాభస్వామి గురించి మార్కండేయ మహర్షి వజ్రుడికి వివరించి చెప్పాడు. "ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు..." అంటే దానికి సమాధానం పద్మానాభాస్వామేనని స్పష్టం చేసాడు ఈ సందర్భంలో మార్కండేయుడు దీనికి సంబందించిన ఓ మహత్తర సన్నివేశాన్ని ఇలా వివరించాడు.
    ఓసారి కల్పాది సమయంలో బ్రహ్మదేవుడికి ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడు ఎవరో బ్రహ్మకు బోధపడలేదు. నీవు ఎవరు? అని బాలుడిని బ్రహ్మ అడిగాడు. అప్పుడతడు చిరునవ్వు నవ్వుతూ ఈ సృష్టి అంతా తనదేనని చెప్పాడు. సకల చరాచర సృష్టిని చేసేవాడిని నేనైతే సృష్టి చేస్తున్నది నీవని అనటంలో సత్యం లేదు కదా! అని బ్రహ్మ ఆ బాలుడితో అన్నాడు. ఈ సృష్టి తన చేతనే జరిగిందని, ప్రస్తుతం సర్వలొకలూ తన ఉదరంలోనే ఉన్నాయని, కావాలంటే లోపలికి వెల్లి చూడమని బ్రహ్మ అతడితో చెప్పాడు. బ్రహ్మ ఉదరంలోకి ప్రవేశించిన ఆ బాలుడు ఓ క్షణం పాటు అక్కడే తిరిగి వెంటనే పైకి వచ్చాడు వచ్చి రాగానే ఈ సృష్టి ఎవరిదో నీవు తెలుసుకోవాలంటే నా ఉదరంలోకి వెళ్ళి చూడు అని పలికి శేషతల్పషాయి అయి హాయిగా విశ్రమించాడు ఆ బాలుడు. బ్రహ్మ ఆ బాలుడి ఉదరంలోకి ప్రవేశించాడు. లోపల పాతాళాది సర్వలోకాలు, వనాలూ, పర్వతాలు, సముద్రాలూ అన్ని కనిపించాయి. బ్రహ్మ ఆ లోకాలన్నిటిని తిరగసాగాడు. ఎంత తిరిగిన ఒక మూల కూడా పూర్తి కాలేదు అలిసిపోయిన బ్రహ్మ తను ఎలా బయటపడాల అని ఆలోచిస్తుంటే బయటకు వెళ్ళటానికి మార్గమే కనిపించలేదు అప్పుడు బ్రహ్మదేవుడు తనకు తొలుత కనిపించిన దివ్య స్వరూపాన్ని స్మరించి శరణు వేడాడు. ఆ శరనాగాతవత్సలుడు  కరుణించి లోపల నుంచి బయటకు వెళ్ళటానికి చిన్నపాటి రంద్రమైన ఉంటుందేమోనని బ్రహ్మదేవుడు చుట్టూ పరికించాడు. ఎక్కడ అటువంటిది కనిపించలేదు. ఏదైనా దోవ చూసుకొని బయటకు వచ్చేందుకు శక్తి లేకపోయింది. బ్రహ్మ వేడుకోలు విన్న ఆ దివ్య పురుషుడు వెంట్రుక కోన కంటె సూక్ష్మమైన ఒక రంద్రాన్ని బ్రహ్మకు కనిపింపచేసాడు. బ్రహ్మ ఆ రంద్రం నుంచి మెల్లగా బయటపడ్డాడు. ఆ వస్తున్న మార్గం ఒక తామర తూడు లాగ బ్రహ్మదేవుడికి అనిపించింది బయటకు వచ్చి చూసేసరికి తానొక అద్బుత పద్మంలో ఉన్నాడు. అలా పద్మం నించి ఆనాడు బ్రహ్మ బయటపడిన కారణం గానే పద్మజన్ముడు అనే పేరొచ్చింది.
    కిందికి పరికించి చూస్తే ఆదిశేషుడి మీద చిద్విలాసంగా పవళించి ఉన్న శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చాడు. బ్రహ్మ ఉన్న పద్మపు తూడు విష్ణువు నాభిలో నుండి వెలువడినట్లు కనిపించింది. ఆ పద్మం సర్వ బ్రహ్మ మండలంగా మేరుపర్వతం ఆ పద్మానికి దుద్దుగా కనిపించింది.
    అందరు అనుకుంటున్నట్లుగా అసలు సృష్టికర్త తను కానని, బ్రహ్మ దేవుడు మార్కండేయుడికి చెప్పాడు. జగన్నాటక సూత్రధారి, జగద్రక్షకుడు, సర్వసృష్టికర్త పద్మనాభుదేనని బ్రహ్మ మాటల రూపంలో ఈ కథ సందర్భం వివరిస్తుంది.

Wednesday 13 April 2011

ధర్మ రక్షణ.

జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు అనేక సందర్భాల్లో ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తాడు. భాగవత కథల్లో శ్రీకృష్ణుడు బాల్యంలో, ఆ తర్వాత గోపికలతో చేసిన రాసలీలల్లో  శ్రీకృష్ణుడు సంతోషించిన తీరుకు, మహాభారతంలో తాను అమితంగా ప్రేమించే పాండవుల్లో బలవంతుడైన భీమసేనుడి కుమారుడు ఘటోత్కచుడు కర్ణుడి శక్తికి గురై అర్ధరాత్రి రణరంగంలో మరణించినప్పుడు కృష్ణుడు నవ్విన నవ్వుకు ఎంతో భేదం ఉంది. ద్రోణ పర్వంలో కురుక్షేత్ర రణరంగ ఘట్టంలో శ్రీకృష్ణుడు సంతోషించటానికి ఘటోత్కచుడి మరణం కారణంగా కనిపించింది. 
    తాము ఎంతో అభిమానంగా, ప్రేమగా చూసుకుంటున్న శౌర్యవంతుడైన ఘటోత్కచుడు కర్ణుడు ప్రయోగించిన శక్తికి గురై మరణించాడు, అప్పుడు పాండవులంతా విపరీతమైన దుఃఖంలో మునిగిపోయారు. కృష్ణుడు మాత్రం తన పక్కనే ఉన్న ఆర్జునుడిని కౌగలించుకొని ఆనందంతో కేరింతలు కొడుతూ గంతులు వేశాడు. కృష్ణుడు ఇలా ప్రవర్తించిన తీరు అక్కడి వారందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుండగా అర్జునుడు కృష్ణుడిని ఎందుకిలా ప్రవర్తిస్తున్నవని అడిగాడు
     తామంత దుఖిస్తుంటే అది  కృష్ణుడికి సంతోషదాయకంగా ఎలా అయిందని ప్రశ్నించాడు. అందుకు బదులుగా కృష్ణుడు తన ముఖంలో నవ్వు చేరగకుండానే అర్జునుడితో ఇలా అన్నాడు.
    అర్జునా ఘటోత్కచుడి మరణం నాకు నిజంగానే అమితానందం కలిగిస్తోంది. కర్ణుడు ప్రయోగించిన శక్తి అతడిని మట్టుపెట్టకుండా ఉన్నట్లయితే అది నిన్ను దహించివేసేది. ఆ శక్తి కర్ణుడి దగ్గర ఉన్నంత కాలం కర్ణుడిని ఎదిరించి జయిoచగలవారు మరెవరు ఉండబోరు. ఇంద్రుడు కర్ణుడి దగ్గర ఉన్న కవచకుoడలాలను తెలివిగా స్వీకరించినప్పటికి యుద్ధంలో ఒక వీరపురుషుడిని సంహరించగల శక్తి మాత్రం కర్ణుడి దగ్గరే మిగిలి ఉంది. ఆ శక్తి అతడి దగ్గర ఉన్నంత కాలం అతడికి తిరుగులేదు. కాని ఇప్పుడాశక్తి ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు ఇక కర్ణుడు సులభంగా యుద్ధంలో మరనించేందుకు అవకాశం ఏర్పడింది అలాగే ఘటోత్కచుడు చిరకాలం జీవించతగిన వాడు కూడా కాదు. అతడు భీముడి కుమారుడైనప్పటికీ దుర్మార్గవర్తనుడు. యుద్ధంలో ఘటోత్కచుడు అలంబుషుడు తదితరులను చంపడానికి ఉపయోగపడ్డాడు. అతడి వల్ల ప్రయోజనం అంత వరకే ఉంది. 
    యజ్ఞాలను ద్వేషించేవాడు, అధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, పాపాత్ముడు అయిన వాడు కనుకనే ఘటోత్కచుడు ఇప్పుడిలా మరణించాడు. వీడి పాపాలను ఇప్పటివరకు ఉపెక్షించింది మిమ్ములను దృష్టిలో ఉంచుకొనే. మీరు వ్యధకు గురవుతారని అలా కావటం మానసిక స్థైర్యాన్ని దిగజార్చి ఉద్దంలో ఇబ్బంది పడతారనే ఘతోత్కచుడిని ఇప్పటి దాకా కాపాడుతూ వచ్చాను. కర్ణుడు నిన్ను చంపటానికి దాచి ఉంచిన శక్తి వాడి మీద పడి నీకు మేలే జరిగింది. అందుకే నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తన సంతోష కారణాన్ని తెలిపాడు. శ్రీకృష్ణుడు భగవత్గితను ఉపదేశిస్తూ ధర్మానికి ఎక్కడ విఘాతం కలుగుతుందో అక్కడ, అప్పుడు తను ఉద్భావిస్తానని ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పిన ధర్మసందేశం ఘటోత్కచుడి మరణ సన్నివేశంలో శ్రీకృష్ణుడు ప్రవర్తన వల్ల రుజువైంది.